02/11/2015
తిరుపతి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న ఏకైక నగరము మరియు ఆంధ్ర ప్రదేశ్ లో 4 వ అతిపెద్ధ నగరం .తిరుపతి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. తిరుపతి నగరానికి విమాన, రైలు, రహదారి సౌకర్యాలు కలవు. ఈ నగరం విజయవాడకు 349 కి.మీ, హైదరాబాదుకు 550 కి.మీ, బెంగళూరుకు 256 కి.మీ., చెన్నైకు 140 కి.మీ దూరంలో ఉంది.
రామానుజాచార్యులు కొండ కింద గోవిందరాజస్వామి ఆలయాన్ని ఏర్పాటుచేయడంతో తిరుమల చరిత్రకు బీజం పడింది. తన శిష్యుడైన యాదవరాజును రామానుజులు ప్రోత్సహించి అప్పటికే ఉన్న చెరువు పక్కన ఆలయ నిర్మాణం ప్రారంభించేలా చేశారు. యాదవరాజు దేవాలయాన్ని నిర్మించడం పూర్తయ్యాకా క్రమంగా చుట్టూ అగ్రహారాన్ని నిర్మించి దానికి తన గురువు పేరిట రామానుజపురం అని నామకరణం చేశారు. రామానుజపురమే కాక యాదవరాజు చాలా గృహాలు నిర్మించారు. శ్రీశైలపూర్ణుడు, అనంతాచార్యులు వంటి భక్తులకు నివాసాలు ఏర్పాటుచేశారు. దేవాలయానికి తూర్పున ధాన్యాగారం, వాయువ్యదిశలో అంగడి వీథి నిర్మించి నేటి తిరుపతి నగరానికి ఆనాడు పునాదివేశారు.