24/05/2020
ఆశ, మహా లాక్టో చాక్లెట్లు గుర్తున్నాయా ? అసలు మరిచిపోతే కదా అంటారా ? అవును ఈ చాక్లెట్లను ఎవరూ మరిచిపోలేరు. అంతలా మన బాల్యంతో ముడిపడిపోయావి ఈ చెక్లెట్లు. మన బాల్యానికి ఈ చాక్లెట్లు ఒక తీపి గుర్తులు. పుట్టినరోజు వస్తే ఆశ చాక్లెట్లు కొని స్కూళ్లో పంచిన రోజులు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఇంతలా మనకు తీపిని, తీపి గుర్తులను పంచిన ఈ చాక్లెట్ కంపెనీ గురించి ఆసక్తికరమైన విషయాలు ఒకసారి చూద్దాం.
ఒక చిన్న కుటీర పరిశ్రమగా ప్రారంభమై విదేశాలకు చాక్లెట్లను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది న్యూట్రీన్ చాక్లెట్ కంపెనీ. ఈ కంపెనీని స్థాపించింది ఒక తెలుగు వ్యాపారవేత్త కావడం ఇక్కడ మరో విశేషం. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలానికి చెందిన బి.వెంకట్రామిరెడ్డి భూస్వామ్య కుటుంబంలో జన్మించారు.
బీవీఆర్ ఆండ్ సన్స్ పేరుతో వేరు శనగ నూనె వ్యాపారం చేసేవారు. ఈ వ్యాపారంలో ఆయన మంచి పేరు సంపాదించారు. నాణ్యతతో ఉండే వీరి కంపెనీలోని నూనెకు అప్పట్లో మంచి పేరు ఉండేది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలోనే బీవీ రెడ్డి కుమారుడు ద్వారాకనాథ్ రెడ్డి అమెరికాలోని లూసియానా స్టేట్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. ఆ సమయంలో విదేశాల్లో ఆయనకు మంచి అవకాశాలు ఉన్నా తాను పుట్టిన గడ్డలోనే వ్యాపారం ప్రారంభించి, పది మందికి ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. దీంతో అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఆయన 1953లో తండ్రి ప్రోత్సాహంతో స్వంత జిల్లా చిత్తూరులోనే న్యూట్రీన్ కన్ఫెక్షనరీస్ కంపెనీని స్థాపించారు.
మొదట 60 మంది కార్మికులతో ఓ కుటీర పరిశ్రమగా ఈ సంస్థ ప్రారంభమైంది. అప్పట్లో న్యూట్రీన్ మిఠాయిల పేరుతో అప్పటివరకు ఎవరికీ పరిచయం లేని చాక్లెట్లను తయారు చేయడం మొదలు పెట్టారు. రుచి అద్భుతంగా ఉండటంతో ఈ చాక్లెట్లకు మంచి పేరొచ్చింది. 1960లలోనే ఈ కంపెనీకి అలనాటి నటి దేవిక అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవారు. చిన్న పిల్లలు ఈ చాక్లెట్లను బాగా ఇష్టపడేవారు. ఇలా దేశమంతా న్యూట్రీన్ మిఠాయిలు బాగా ఫేమస్ అయ్యాయి.
ఈ కంపెనీ నుంచే ఆశ, మహా ల్యాక్టో చాక్లెట్లు కూడా వచ్చాయి. ఇవి 1990లలో బాగా ప్రాచుర్యం పొందాయి. పిల్లలు ఎంతో ఇష్టపడి ఈ చాక్లెట్లను తినేవారు. తర్వాత ద్వారకానాథ్ రెడ్డి కుమారుడు విక్రమ్ రెడ్డి ఈ సంస్థ బాధ్యతలను చేపట్టారు. వెరైటీ చాక్లెట్లను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఒకానొక సమయంలో వివిధ దేశాలకు న్యూట్రీన్ కంపెనీ నుంచి సుమారు 40 రకాల ఉత్పత్తులు ఎగుమతి చేసేవారంటే ఈ చాక్లెట్లు ఎంతగా ఫేమస్ అయ్యాయో అర్థం చేసుకోవచ్చు.
అయితే, చాక్లెట్ల పరిశ్రమలోకి పెద్ద ఎత్తున మల్టీ నేషనల్ కంపెనీలు రావడం, పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో వాటికి ఆదరణ పెరిగింది. ఫలితంగా న్యూట్రీన్ కంపెనీ ప్రాభవం తగ్గిపోయింది. ఒకప్పుడు నెలకు 3 వేల టన్నుల ఉండే ఉత్పత్తి 300 టన్నులకు పడిపోయింది. దీంతో 2004లో గోడ్రేజ్ సంస్థ న్యూట్రీన్ను టేకోవర్ చేసింది. న్యూట్రీన్ పేరుతోనే చాక్లెట్ల ఉత్పత్తి చేసింది. ఆ తర్వాత గోడ్రేజ్ నుంచి హార్షే అనే మరో కంపెనీ 2007లో టేకోవర్ చేసింది. అయితే, ఆదరణ తగ్గిపోవడంతో న్యూట్రీన్ చాక్లెట్ల ఉత్పత్తిని కంపెనీ మూసేసింది. ఫలితంగా ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ కంపెనీ మూతబడింది.